ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదల అయ్యాయి. 2025 డిసెంబర్ 7వ తేదిన జరిగిన ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్ధుల వెబ్మెరిట్ కార్డులు ప్రభుత్వ పరీక్ష కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎంపికైన విద్యార్ధులు వెంటనే బ్యాంక్ ఖాతా తెరిచి, విద్యార్ధి ఆధార్ను లింకు చేయించి, డిబిటి ద్వారా డబ్బులు జమయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. మెరిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేర్ల వివరాలు ఆధార్ కార్డుపై ఉన్న విధంగానే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో నమోదు చేసుకుని దరఖాస్తు సబ్మిట్ చేయాలని వివరించారు. ఆ తరువాత సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్, జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ల ద్వారా అనుమతి చేయించుకోవాలని తెలిపారు.
ముద్రించిన మెరిట్కార్డులను త్వరలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు పంపుతామని పేర్కొన్నారు. విద్యార్ధి బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడ్ చేయించుకొని డిబిటి నగదు జమయ్యేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.







కామెంట్లు (0)