విశాఖ ఎకనామిక్ రీజియన్పై సిఎం ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విశాఖ ఎకనమిక్ రీజియన్ (విఇఆర్) అభివృద్ధి ప్రణాళికలపై బుధవారం సిఎం సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని మూల పేట పోర్టు మొదలుకుని, రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్ట్ వరకూ ప్రతి ప్రాంతాన్ని, రంగాన్ని కలిపేలా ప్రణాళిక రూపొందాలన్నారు. పెట్టుబడులు రావడానికి వీలుగా వివిధ ప్రాంతాలను అనుసం ధానిలా ప్రణాళిక ఉండాలన్నారు. ఇందుకు వివిధ పధకాల నిధులను కన్వెర్జెన్స్ చేసి ఈ ప్రాజెక్టు కోసం వినియోగించాలన్నారు. అలాగే కేంద్ర నిధులను మరింతగా రాబట్టే అంశంపై దృష్టి సారించా లన్నారు. విఇఆర్ పరిధిలో ఉన్న ఆరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అద్భుతమైన అభివృద్ధి జరగాలని, ఈ ప్రాజెక్టును వినియోగించుకుని ప్రతి ప్రాంతంలోనూ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. పిపిపి ప్రాజెక్టులను అమల్లోకి తీసుకురావడంతోపాటు.. వాటికి విజిఎఫ్ స్కీం అమలు చేసే అంశాలను పరిశీలించాలని ఆదేశించారు
బే సిటీ కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ
బేసిటీ ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. జిసిసి, ఫిన్ టెక్, లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ రంగాలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల రూపకల్పన.. పెట్టుబడుల సాధన జరిగేలా ప్రణాళికలను సిద్దం చేయాలని ఆదేశించారు. రోడ్-రైల్ ఇంటిగ్రేషన్ జరగాలని, కాకినాడ, విశాఖలతో పశ్చిమ భారత్ లోని వివిధ ప్రాంతాలు అనుసంధానం కావాలన్నారు. ముఖ్యంగా 4 ఎయిర్ పోర్టులు, 3 పోర్టులు లింక్ చేస్తే అభివృద్ధి వేగంగా జరగడంతోపాటు... పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. విశాఖలో జంతు ప్రదర్శన శాలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ నగరంగా విశాఖ ఎదుగుతోందని తెలిపారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్ధిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక, విద్య, వైద్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.








కామెంట్లు (0)