డీప్ఫేక్లు, కంటెంట్ లోపాలపై విచారం
అంతకుముందు అల్టిమేటం జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కేంద్రానికి మెటా సిఇఒ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ (సిఎస్ఎఎమ్), డీప్ఫేక్లు, అల్గారిథమిక్ పాలనలో జరిగిన తీవ్రమైన లోపాలపై జుకర్బర్గ్ అధికారికంగా క్షమాపణలు చెప్పి.. విచారం వ్యక్తం చేశారు. బుధవారం మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఈ సందర్భంగా కంపెనీ తరఫున తాను క్షమాపణ తెలిపానని కప్లాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని వీడియో తొలగింపుపై మెటా ప్రతినిధులు వివరణ ఇచ్చారు. కొన్ని రకాల కంటెంట్ను ప్రోత్సహించడానికి భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే, మెటా వంటి ప్లాట్ఫారమ్లు ఐటి చట్టం ప్రకారం మధ్యవర్తి నిర్వచనం పరిధిలోకి రావని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరకర కంటెంట్ను ఎలా అనుమతించారంటూ కేంద్రం ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరింది. అలాగే, గత నెల జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలను ఇన్స్టాగ్రామ్ ఎలా ప్రచారం చేసిందన్న ఆందోళనలు, మోదీ పోస్ట్ తొలగింపు నేపథ్యంలో ఈ భేటీలు జరిగాయి. సిఎస్ఎఎమ్ ప్రచారానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటనలపై బిబిసి నివేదికపై కూడా ప్రభుత్వం మెటాను నిలదీసింది. ఈ సమావేశం అనంతరం మెటా సిఇఒ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు కోరడం గమనార్హం. మెటాను మరోసారి పిలుస్తామని, తదుపరి భేటీలు జరుగుతాయని ప్రభుత్వ శ్రేణులు తెలిపాయి. అయితే, సోషల్ మీడియాలో ప్రధాని వీడియో తొలగింపుపై కేంద్రం మెటాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.







కామెంట్లు (0)