ఎల్ఐసిలో ప్రభుత్వ వాటా తగ్గింపు నిర్ణయంపై ఉద్యోగుల నిరసన
ప్రజాశక్తి - యంత్రాంగం : ఆఫర్ ఫర్ సేల్స్ (ఒఎఫ్ఎస్) ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తన వాటాను మరింత తగ్గించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బుధవారం ఎల్ఐసి ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాల్లో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సెబీ నిబంధనలను సాకుగా చూపుతున్నప్పటికీ, ఇది దేశంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థపై ప్రజా యాజమాన్యాన్ని బలహీనపరిచే చర్యేనని పలువురు నాయకులు విమర్శించారు. ప్రతిపాదిత ఒఎఫ్ఎస్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని, పి ఎస్ యు ల ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రతిష్టను కాపాడటంలో ఎల్ఐసిలో ప్రభుత్వ వాటాను తగ్గించే ప్రతి ప్రయత్నాన్ని వ్యతిరేకించడంలో ఉద్యోగులు చూపుతున్న సంకల్పాన్ని అభినందించారు.
విశాఖలోని డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్స్ పాల్గొన్నారు. 'ఎల్ఐసి భారత ప్రజల సొంతం, స్టాక్ మార్కెట్ది కాదు` అని నినదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని పెద్దపెట్టున నినాదాలు చేశారు. గాజువాక, షిప్యార్డు బ్రాంచ్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టి కేంద్ర తీరును నిరసించారు. అనకాపల్లి, చోడవరంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సిఐటియు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. పార్వతీపురం, విజయనగరం, శృంగవరపుకోట, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కర్నూలు, నంద్యాలలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.







కామెంట్లు (0)