పలు మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీం
న్యూఢిల్లీ : వేగవంతమైన దర్యాప్తుపై దృష్టి పెట్టడం, దొంగిలించబడిన డబ్బును రికవరీ చేసుకోవడం, బ్యాంక్ల భద్రతలు, బాధితుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ డిజిటల్ అరెస్టు కుంభకోణాలపై ప్రభుత్వ స్పందనను మరింత బలోపేతం చేసేందుకు సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్టు కుంభకోణాలకు సంబంధించి కార్యకలాపాలను సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న సుప్రీం బెంచ్ వీటిని నివారించేందుకు పలు ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ ఈ విచారణ జరిపింది. ఈ కేసులు కాస్తంతగా తగ్గినా, మరింత నిఘా కొనసాగాల్సిన అవసరం వుందని స్పష్టం చేసింది.
సైబర్ మోసాలకు సంబంధించిన ఖాతాల నిర్వహణకు సంబంధించి బ్యాంకుల కోసం నాలుగు వారాల్లోగా ప్రామాణికమైన ఎస్ఓపిని ఆమోదించాలని ఆర్బిఐని ఆదేశించింది. ఆయా ఖాతాల నుండి డబ్బును తీసుకోవడాన్ని తాత్కాలికంగా స్తంభింపచేయడం, ఇబ్బందులను పరిష్కరించడం, మోసపోయిన డబ్బును తిరిగి స్వాధీనం చేసుకోవడంతో సహా పలుచర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహించాలి. ఇ జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థను అమలు చేయాలి.
సైబర్ మోసాలతో సంబంధమున్న స్తంభింపచేసిన బ్యాంక్ ఖాతాల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. 36,920 కేసుల్లో బాధితులకు రూ.18.05కోట్లను ఇప్పటికే రికవరీ చేశారని కోర్టు గుర్తించింది. ఇందులో 57 బ్యాంకులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వున్నాయని పేర్కొంది.16 రాష్ట్రాల్లో సంఘటిత సైబర్ మోసాలకు సంబంధించిన నెట్వర్క్లతో ప్రమేయమున్న కేసులను సిబిఐ దర్యాప్తు చేసింది. సోదాలు నిర్వహించింది.
డిజిటల్ అరెస్టు బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధానాన్ని అంతర్రాష్ట్ర విభాగాల కమిటీ పరిశీలిస్తుంది. సిబిఐ దర్యాప్తులు చేపట్టడానికి సంబంధించి ఆర్థిక పరిమితులను తగ్గించడం, అలాగే ఒకే వ్యవస్థీకృత నెట్వర్క్కు సంబంధించిన కేసులన్నింటినీ కలిపివేడయం వంటి అంశాలను పరిశీలించాల్సిందిగా కూడా అధికారులను కోర్టు కోరింది.
డిజిటల్ అరెస్టు కుంభకోణాలకు అరికట్టే చర్యల్లో భాగంగా ఆడియో/వీడియో టెలికం సేవలపై కాల పరిమితితో కూడిన ఆంక్షలను విధించే అంశాన్ని టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ, భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సి)లు పరిశీలిస్తాయి. పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను, లీగల్ సర్వీసెస్ కమిటీలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
మొత్తమ్మీద డిజిటల్ అరెస్టు కుంభకోణాలను నివారించేందుకు, ఒకవేళ దొంగిలించిన సొమ్ము వెంటనే డ్రా చేసుకోకుండా వాటిని స్తంభింపచేసేందుకు, అలాగే నిధుల రికవరీకి, సైబర్నేరాల దర్యాప్తుల మెరుగుదలకు, బాధితులకు అవసరమైతే మరింతగా తోడ్పాటును, నష్టపరిహారాన్ని అందించేదుకు అత్యంత సమన్వయంతో కూడిన జాతీయ స్థాయి వ్యవస్థ వుండాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కోరుతోంది. ఈ కేసును మళ్ళీ సెప్టెంబరులో విచారించనున్నట్లు తెలిపింది.







కామెంట్లు (0)