జెన్ జి నిరసనలపై సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ : నీట్ యుజి పేపర్ లీక్ల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్ధులు, యువత, నిర్వాహకులు చెబుతున్నది ముందుగా వినాలని, అంతేతప్ప వారిని అణచివేసే చర్యలు చేపట్టరాదని సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ‘‘వారికి నచ్చచెప్పడం, వారిని శాంతింపచేయడం అన్నింటికంటే మంచి మార్గం...తార్కికంగా ఆలోచించడమనేది అన్నింటికంటే శక్తివంతమైన మార్గం. ముందుగా వారు చెబుతున్నది వినండి, అప్పడు దాన్ని ఎలా ఎదుర్కొనాలో ప్రభుత్వానికి తెలుస్తుంది.’’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మనీష్ కుమార్ సోలంకి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సిజెపి నిర్వాహకులు చెబుతున్నది వినడానికి, వారు చెప్పేది చేయడానికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. జులై 20న పోలీసుల చర్యలు జరిగి 15 రోజులు గడిచింది, కానీ ఇంతవరకు నిర్వాహకులను జవాబుదారీ చేస్తూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు అని పిటిషనర్ వాదించారు.
‘యువతను శాంతింపచేయాల్సిన అవసరం వుంది. వారిలోకొందరు రాళ్ళు విసిరి వుండవచ్చు, కానీ వారికి సలహాలు, సూచనలు, నచ్చచెప్పడాలు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ తరుణంలో ఎలాంటి దూకుడు చర్యలు తీసుకున్నా పరిస్థితి మరింత పెచ్చరిల్లడం తప్ప మరేమీ వుండదు. తద్వారా మరిన్ని ఉల్లంఘనలకు వారు పాల్పడేందుకు దారి తీస్తుంది. దాన్నంతటినీ నివారించాల్సి వుంది.’’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. యువతరంతో వ్యవహరించేటపుడు బల ప్రయోగానికి దిగడం కన్నా లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు సంయమనం పాటించడం మెరుగైన వ్యవహారమని అన్నారు. శాంతియుతంగా సాగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారవచ్చు, అయితే పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వమేనని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. నీట్ నిరసనలపై దాఖలైన పిటిషన్లతో పాటు విచారించేందుకు ఈ పిటిషన్ను కూడా వాటితో కలిపారు. ఆ పిటిషన్లపై 18వ తేదీన విచారణ జరగనుంది.







కామెంట్లు (0)