- మాజీ సిఎం జగన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రామాయపట్నం పోర్టును అభివృద్ధి పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలిగించే ప్రయత్నం జరుగుతోందని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. పోర్టు ఆధారిత అభివృద్ధితో రాష్ట్రానికి అపారమైన ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని ఆయన సామాజిక మాధ్యం ఎక్స్లో పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధికి భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, ఆర్థిక ముగింపు వంటి కీలక ప్రక్రియలను పూర్తి చేసి, నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. రామాయపట్నం పోర్టు కారణంగా బిపిసిఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ సముదాయం, ఇండోసోల్ సోలార్ గిగా స్కేల్ తయారీ కేంద్రం, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను, పన్నేతర ఆదాయం పెరుగుతుందని అన్నారు. అయితే టిడిపి ప్రభుత్వం రూ.4,929 కోట్ల ప్రజాధనంతో అభివృద్ధి చేస్తున్న పోర్టును ప్రైవేటు సంస్థలకు కేవలం రూ.1,500 కోట్ల ముందస్తు చెల్లింపుతో అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లడంతో పాటు రూ.3,500 కోట్లకు పైగా రుణ సేవల భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రజాధనంతో నిర్మించిన పోర్టును ప్రైవేటు ప్రయోజనాలకు అప్పగించకుండా ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)