ప్రజాశక్తి- విజయవాడ: "ఐదు రోజుల బ్యాంకింగ్" కోసం బ్యాంకుల సిబ్బంది, అధికారులు మరోసారి ఐక్యంగా రోడ్డెక్కారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఎఐబిఇఎ, ఎఐబిఒసి, ఎన్సిబిఇ, ఎఐబిఒఎ, బిఇఎఫ్ఐ, ఐఎన్బిఇఎఫ్, ఐఎన్బిఒఎఫ్లకు చెందిన ఆయా జాతీయ బ్యాంకుల సిబ్బంది, అధికారులు పాల్గొని "ఫైవ్ డే బ్యాంకింగ్" కోసం ముక్తకంఠంతో నినదించారు. విఎస్ఆర్ శేఖర్ అధ్యక్షత వహించిన ధర్నా కార్యక్రమంలో నాయకులు కె శ్రీనివాస్, ఆర్ అజయ్ కుమార్, పి నారయ్య, ఎస్వి రమణ, హర్షవర్ధన్, ప్రశాంత్, కాశీవిశ్వనాథ్, ప్రభాకర్ తదితరులు ప్రసంగిస్తూ- ఆరు నెలల్లోగా అమలు చేస్తామన్న డిమాండ్ 29 నెలల వరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని గర్హించారు. వారానికి ఐదు రోజుల పని విధానం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారమూ లేదని.. పైగా పాలనాపరమైన మిగులు ఉంటుందని విశదీకరించారు. వినియోగదారులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. పన్నెండో ద్వైపాక్షిక ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకుల్లో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య రానురానూ కుదించుకుపోతోందని.. అవుట్సోర్సింగ్ సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారని నాయకులు గుర్తుచేశారు.









కామెంట్లు (0)