‘అనంత’లో ఆకులు కట్టుకుని ఎస్ఎఫ్ఐ నిరసన
ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, యూనిఫాం వెంటనే ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద విద్యార్థులు ఆకులు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్, జిల్లా అధ్యక్షులు తరిమెల గిరి, రాష్ట్ర కమిటీ సభ్యులు బంగి శివ మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులు, ప్రభుత్వ విద్యపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచి రెండు వారాలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిస్థాయిలో అందించలేదన్నారు.
యుద్ధం కారణంతో విద్యార్థి మిత్ర కిట్లు సకాలంలో ఇవ్వలేకపోయామని చేస్తున్న ప్రకటించడం శోచనీయమన్నారు. 2026-27 విద్యా సంవత్సరం విద్యాకిట్లకు సంబంధించి దాదాపు రూ.870 కోట్లను 2025 డిసెంబర్ నెలలోనే కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులని ఇచ్చినట్లు చేసిన ప్రకటన ఈ సందర్భంగా గుర్తు చేశారు. యుద్ధం మార్చిలో అయితే అంతకు ముందే సిద్ధం చేయాల్సిన యంత్రాంగం ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36 లక్షల మంది విద్యార్థులు విద్యార్థి మిత్ర కిట్లు, యూనిఫామ్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా మంత్రి లోకేష్ తక్షణం మేల్కొని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన కిట్లను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, సూర్య ప్రకాష్, నవీన్, అరుణ్ రషీద్ పాల్గొన్నారు.









కామెంట్లు (0)