- విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్ర తీరప్రాంతము నుండి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ సోమవారంనాడు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ మంగళవారంనాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలలోపు గుంటూరు జిల్లా మంగళగిరిలో 68.2 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.








కామెంట్లు (0)