- పిడుగుపాటుకు ఇద్దరు గిరిజన మహిళల మృతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, మందస, పలాస ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా సోమవారం నాడు ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల పడే అవకాశముందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగముతో బలమైన గాలులు వీచే అవకాశముందని వివరించారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల పడే అవకాశం ఉంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు గిరిజన మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బుడార్సింగి పంచాయతీ పడంగో గ్రామంలో ఆదివారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న కార్మికుల సమీపాన పిడుగు పడింది. దీంతో పడంగో గ్రామానికి చెందిన కె సోముద్రి (44), పాతకోటకు చెందిన సవర జోర (45) అక్కడికక్కడే మరణించారు. మజ్జి దేవకి, బుయా పోరోమి, కుమారో నీలా, కట్టువ సుస్మితకు తీవ్ర గాయాలయ్యాయి. వారి కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు, గిరిజన నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.







కామెంట్లు (0)