రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం
పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర పట్టణాభివృద్దిశాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ అన్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన రాయపూడిలోని సిఆర్డిఎ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రి పి.నారాయణ, పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ రంగాల్లో అమలవుతున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న వివిధ పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రస్తుత స్థితి, మెప్మా ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి రూపొందించిన విజన్ను అభినందించారు. ఆధునిక సౌకర్యాలు, సమగ్ర ప్రణాళికతో అమరావతి దేశంలోనే ఆదర్శవంతమైన రాజధానిగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలకు సేవలందిస్తున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెలా “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఎమ్డి అరుణ్ కుమార్, టిడ్కో ఎమ్డీ సునీల్ కుమార్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎమ్డి అనిల్ కుమార్ రెడ్డితోపాటు హడ్కో, మెప్మా, ఆర్టిసి అధికారులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)