- 7.03 లక్షల టన్నులకు కిలోకు రూ.4 చొప్పున చెల్లింపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తోటాపురి మామిడి రైతులకు మద్దతుగా కనీస మద్దతు ధరలో లోటును చెల్లించేందుకు రూ.281 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో ధర లోటు చెల్లింపునకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ బుధవారం ఉత్తుర్వులు జారీ చేసింది. మార్కెట్ జోక్య పథకం కింద తోటాపురి మామిడికి ధర లోటు చెల్లింపును అమలు చేయాలని ఉద్యానశాఖ ప్రభుత్వాన్ని కోరింది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించనున్నారు. మొత్తం 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోటాపురి మామిడి ఉత్పత్తికి కిలోకు రూ.4 చొప్పున ధర లోటు చెల్లింపు చేయనున్నారు. నిధుల సమీకరణ, అవసరమైన తదుపరి చర్యలను ఎపి మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ధర లోటు చెల్లింపులు పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని తిరిగి పొందేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని ఉద్యానశాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీని సకాలంలో చెల్లించడం, అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టాలని సూచించింది.








కామెంట్లు (0)