ప్రజాశక్తి - కొండపి(ప్రకాశం) : ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొండపి నుంచి ఒంగోలుకు వెళ్తున్న సమయంలో అనకర్లపూడి-మద్దులూరు గ్రామాల మధ్య ద్వారకా సీఫుడ్స్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇచ్చే క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు ఒరిగి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. బస్సు ఒక్కసారిగా బోల్తా పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురై పెద్దగా కేకలు వేశారు. ప్రమాదాన్ని గమనించిన అనకర్లపూడి, మద్దులూరు గ్రామాల స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అద్దాలను పగులగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు.
గాయపడిన వారిని 108 అంబులెన్స్ల ద్వారా కొండపి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.








కామెంట్లు (0)