కేరళ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి శశిథరూర్కు తృటిలో ప్రమాదం తప్పింది. కేరళలోని త్రివేండ్రంలో ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్లో ఆయన అరగంటపాటు చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి హైడ్రాలిక్ పరికరాల సాయంతో తలుపులు తెరిచి ఆయనను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు శశిథరూర్ శుక్రవారం సాయంత్రం స్థానిక హోటల్కు వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. వెంటనే హోటల్ సిబ్బంది ఇనుప రాడ్ల సాయంతో తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యాధునిక 'హైడ్రాలిక్ స్ప్రెడర్' సాయంతో లిఫ్ట్ తలుపులను విడదీసి, శశిథరూర్తో పాటు అందులో ఉన్న మరో 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. లిఫ్ట్ నుండి బయటకు రాగానే ఎంపి శశిథరూర్ చిరునవ్వుతో అగ్నిమాపక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. "మీరు అద్భుతంగా పనిచేశారు, అందరికీ ధన్యవాదాలు" అంటూ వారి రెస్క్యూ ఆపరేషన్ను అభినందించారు. అనంతరం ఈ ఘటనపై ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "లిఫ్ట్లో అరగంట పాటు చిక్కుకుపోవడం పెద్ద సమస్యేమీ కాదు, కానీ దీనివల్ల నా తర్వాతి రెండు ముఖ్యమైన సమావేశాలకు ఆలస్యమైంది" అని పోస్ట్ చేశారు.
లిఫ్ట్ లో చిక్కుకున్న ఎంపి శశిథరూర్ .. అరగంటసేపు ..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)