డిఎస్సిపై తక్షణ చర్చకు వైసిపి పట్టు
అంగీకరించని ప్రభుత్వం
28 నిమిషాలకే ముగిసిన సభ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన మండలిలో రెండో రోజు మంగళవారం నాడూ డిఎస్సిపై చర్చకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సభ కార్యకలాపాల నిర్వహణపై ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రశ్నోత్తరాలు జరుగుతున్నంతసేపు సభలో వైసిపి సభ్యులు డిఎస్సిపై సిబిఐ విచారణ నిర్వహించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో సభ ఆర్డర్లో లేకపోవడంతో ఛైర్మన్ మోషేన్రాజు వాయిదా వేశారు. తరువాత మంత్రివర్గ సమావేశం ఉండటంతో మంత్రులంతా వెళ్లిపోయారు. సోమవారం జరిగిన బిఎసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైసిపి సభ్యులు వ్యతిరేకించారు. తొలుత డిఎస్సిపై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో ఛైర్మన్ చర్చించి ప్రత్యేక బిఎసి సమావేశం తన ఛాంబర్లో నిర్వహించారు. అయితే ముందు ఎల్నినోపై చర్చ జరపాలని 20న డిఎస్సిపై చర్చిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలపగా వైసిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందు డిఎస్సిపై చర్చించాలని, తరువాతనే ఎల్నినో ఇతర అంశాలపై చర్చంచాలని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మీరు చెప్పినట్టు తాము సభ నిర్వహించబోమని ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం సభ నడుస్తుందని పయ్యావుల స్పష్టం చేశారు. అంతకుముందు కూడా మండలిలో కేశవ్, బొత్స మధ్య ఈ అంశంపై వాగ్వాదం జరిగింది. ఎల్నినోతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సమస్యలు చర్చించకుండా అల్లరి చేసి వెళ్లిపోదామనే ధోరణిలో ప్రతిపక్ష సభ్యులు ఉన్నారని పయ్యావుల విమర్శించారు. బొత్స మాట్లాడుతూ.. సోమవారం శాసనసభలో ముందుగా ఎల్నినోపై చర్చ జరగకుండా, ముందు డిఎస్సిపై ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభను మరో రెండు రోజులు పొడిగించాలని కోరారు. సభ్యుల ఆందోళన మధ్యలో సభను ఛైర్మన్ వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 1:45 నిమిషాలకు సభ ప్రారంభం కాగానే ఎటువంటి కార్యకలాపాలు, చర్చలు లేకుండానే ఛైర్మన్ బుధవారానికి సభను వాయిదా వేశారు.







కామెంట్లు (0)