- మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు నేవీ, కోస్ట్ గార్డు అధికారులను ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని వనరులను వినియోగించి సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారుల పరిస్థితిపై నేవీ, కోస్ట్ గార్డు అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. రెండో రోజూ ప్రత్యేక నౌక, రెస్క్యూ బోటు, హెలికాప్టర్ సహాయంతో నేవీ, కోస్ట్ గార్డు సంయుక్తంగా విస్తృత గాలింపు చేపడుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. కారి చిన్నను ఈ రోజు ఉదయం 10 గంటలకు విశాఖ ఫిషింగ్ హార్బర్కు తీసుకురానున్నట్లు కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో కారి గంగయ్య, అమర అప్పలరాజు, కారి సితోడు, మేడ చిన అమ్మోరు, కారి చిన్నయ్య, రాగుతూ బండియ్య ఉన్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.








కామెంట్లు (0)