దేవేంద్ర మహతో
రాంచీ : జెపిఎస్సి, జెఎస్ఎస్సి నుంచి అవినీతిరహిత నియామక పరీక్షల కోసం త్వరలోనే రెండో దశ ఆందోళనలు ప్రారంభిస్తామని జార్ఖండ్ లోక్తంత్రిక్ క్రాంతికారి మోర్చా (జెఎల్కెఎం) నాయకులు దేవేంద్ర మహతో మంగళవారం ప్రకటించారు. అక్రమాలు జరిగిన ఉద్యోగ పరీక్షలను జార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేయడంతో 16 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను మహతో మంగళవారం విరమించారు. ‘భవిష్యత్లో నియమాక పరీక్షల్లో అక్రమాలు లేదా పేపర్ లీక్లు జరగవని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకూ’ తమ ఆందోళనలు కొనసాగుతాయని మహతో ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మరికొంత మంది విద్యార్థులు పట్టుబడుతున్నా.. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (జెఎస్ఎస్సి-సిజిఎల్) పరీక్షను రద్దు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని దేవేంద్ర మహతో స్వాగతించారు. విద్యార్థి ఉద్యమానికి ఈ నిర్ణయం "చారిత్రాత్మక విజయం" అని పేర్కొన్నారు.
మరోవైపు, జెఎస్ఎస్సి-సిజిఎల్ పరీక్షను రద్దు చేయడానికి వ్యతిరేకంగా జార్ఖండ్ సచివాలయం వెలుపల మంగళవారం ప్రతినిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షల్లో అక్రమాలపై విచారణకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమకు ఒక నిష్పక్షపాతమైన అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ర్టంలో కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, జెఎస్ఎస్సి-సిజిఎల్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు.. ఇద్దరు కూడా సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నట్లయింది.







కామెంట్లు (0)