అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సవరించిన షెడ్యూల్ను ప్రకటించారు. ఇప్పటివరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువు జులై 31తో ముగిసింది. తాజాగా మరో అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్ 10 వరకు గడువు పొడిగించారు. ఈ వ్యవధిలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు, తొలగింపు, వివరాల సవరణతోపాటు ఇతర అభ్యంతరాలను దాఖలు చేసుకోవచ్చు. దరఖాస్తులపై నోటీసుల జారీ, విచారణ, పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని సిఇఒ ఆదేశించారు. అనంతరం సవరించిన తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 9న ప్రచురించనున్నారు. గడువు పొడిగింపు, తుది జాబితా ప్రచురణ తేదీలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఇఆర్ఒ), సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఎఇఆర్ఒ), బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఒ)కు తగిన సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సవరించిన షెడ్యూల్ను తెలియజేయాలని సూచించారు.
28.80 లక్షల నోటీసులకు విచారణలు పూర్తి
డెలివరీ అయిన 44.22 లక్షల నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు (సెప్టెంబర్ 1వ తేదీ వరకు) 28.80 లక్షల విచారణలు పూర్తయ్యాయి. అంటే డెలివరీ అయిన నోటీసుల్లో సుమారు 65 శాతం కేసుల్లో విచారణలు పూర్తయ్యాయి. విచారణల నిర్వహణలో కర్నూలు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు జిల్లాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నోటీసుల డెలివరీతో పాటు విచారణలను కూడా వేగంగా పూర్తి చేసి పెండెన్సీని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు







కామెంట్లు (0)