రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సౌకర్యార్ధం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీరావుతో కలిసి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ప్రత్యేక ప్రచార దినాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు (బిఎల్ఒ), రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని వివేక్ యాదవ్ ఆదేశించారు. ఓటరు జాబితా పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ, అవసరమైన మార్గదర్శకాల్లో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. కొత్తగా అర్హత పొందిన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఓటరు జాబితాకు సంబంధించి అందే అభ్యంతరాలు, దరఖాస్తులపై విచారణను వేగవంతం చేయాలని తెలిపారు. విచారణ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు సమర్పించే పత్రాలను వెంటనే సంబంధిత దరఖాస్తులో నమోదు చేయాలని ఆదేశించారు. అదన పు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీరావు మాట్లా డుతూ అన్ని పోలింగ్ కేంద్రాల స్థాయి అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసుల పంపిణీ, దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం, పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడే సేవకు సంబంధించిన పెండింగ్ అంశాలపైనా సమావేశంలో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు సిఇఒ ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)