- రాజమండ్రి ఘటనపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆదేశాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజమహేంద్రవరంలో మెడికోలను కారుతో ఢీకొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడివిడిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సిఎం చంద్రబాబు మెడికోలు తీవ్రంగా గాయపడడం బాధాకరమని తెలిపారు. ఘటన జరిగిన తీరును అధికారులు సిఎంకు వివరించారు. మద్యం మత్తులో ఇద్దరు మెడికోలను కారుతో ఢీకొట్టి పరారయ్యారని చెప్పారు. ఘటనకు కారణమైన నిందితులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని స్పష్టం చేశారు. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బాధిత మెడికోలకు అవసరమైన వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ ఘటనలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజి డిఐజితో మాట్లాడి ఈ ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.







కామెంట్లు (0)