- ఎమ్మెల్సీలు, అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర మంత్రిని కలిసిన టీచర్లపై సస్పెన్షన్ వేటు దుర్మార్గమని వైసిపి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖలోనూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, డీఎస్సీ అక్రమాలను, ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులకు ముడిపెట్టడం దారుణమని విమర్శించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకంత కక్షగట్టారో అర్థం కావడం లేదని తెలిపారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలనే న్యాయమైన డిమాండ్పై కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ముగ్గురు ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, రాజకీయ కక్షసాధింపులే ధ్యేయంగా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు.








కామెంట్లు (0)