‘3పి’ విధానంతో నివారణపై దృష్టి
హోంమంత్రి అనిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేరాల నియంత్రణకు రాష్ట్రంలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి వంగల పూడి అనిత తెలిపారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న మూడు రోజుల ‘ఫ్యూచర్-రెడీ ఎపి పోలీస్ రిట్రీట్’ను మంగళవారం విజయవాడలో హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసుశాఖ.. ప్రజలకు రక్షణ కల్పించే సంస్థ మాత్రమే కాకుండా రాష్ర్టాభివృద్ధికి భాగస్వామిగా కూడా పనిచేయాలని సూచించారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా వినూత్న విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రెడిక్షన్–ప్రికాషన్–ప్రివెన్షన్ (ట్రిపుల్ పి) విధానాన్ని అమలు చేస్తూ నేరాలు జరిగే ముందే వాటిని అరికట్టే దిశగా పోలీసింగ్ ఉండాలన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, రౌడీయిజం, మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు మరింత సాంకేతికత ఆధారిత వ్యూహాలు రూపొందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరిస్తున్న కొత్త తరహా నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన బృందాలను తయారు చేయాలని అధికారులకు సూచించారు. డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. నేటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థను పూర్తిగా, కొత్తగా నిర్మించాల్సి వస్తే, ప్రస్తుతం ఉన్న పోలీస్టేషన్లు, సంప్రదాయ విధానాలు, పరిపాలనా నిర్మాణాలకు భిన్నంగా కొత్త నమూనాతో అవతరిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి నేరాల స్వరూపం గణనీయంగా మారిపోతుందని, ఎక్కువ శాతం నేరాలు డిజిటల్ వేదికలపై జరుగుతాయని, భౌతిక ఆధారాలు లేకుండానే నేరాలను ఛేదించాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పారు.
మొదటి రోజు రిట్రీట్లో భవిష్యత్ పోలీసింగ్కు సంబంధించి సైబర్, టెక్నాలజీ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ఎదురయ్యే భవిష్యత్ సవాళ్లు, డ్రోన్ ముప్పులు, కీలక మౌలిక వసతుల రక్షణ, ఉగ్రవాద నిరోధం, రోడ్డు భద్రత, రవాణా భద్రత, పట్టణ చలనశీలత, మానవ వనరుల సంస్కరణలు, శిక్షణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ధి, టెక్నాలజీ ఆధునీకరణ, డిజిటల్ పోలీస్ ఆర్కిటెక్చర్, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై అధికారులు, నిపుణులు అభిప్రాయాలు పంచుకున్నారు.








కామెంట్లు (0)