- కూటమి ఐక్యతను దెబ్బతీయడమే వైసిపి లక్ష్యం
- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో చిచ్చుపెట్టేందుకు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కుట్రలు పట్ల టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. కూటమి నేతలు, కార్యకర్తల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి ఒక పార్టీకి చెందిన వ్యక్తులుగా మరో మిత్రపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు పాల్పడుతున్నారని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. మూడు పార్టీల మధ్య అపోహలు సృష్టించి కూటమి ఐక్యతను దెబ్బతీయడమే వైసిపి లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి కుతంత్రాలకు టిడిపి శ్రేణులు రెచ్చిపోవద్దని సూచించారు. ఫేక్ ఖాతాల వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, నేరుగా సోషల్ మీడియాలో స్పందిస్తూ కూటమి ఐక్యతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. వైసిపి తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి పక్షాల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్యకర్తలు సంయమనం పాటిస్తూ కూటమి బలోపేతానికి కృషి చేయాలని, వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియా వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. కూటమి ఐక్యతే బలమని, కూటమి విజయమే రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా పేర్కొన్నారు.







కామెంట్లు (0)