- సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా సోనమ్ వాంగ్చుక్తో చర్చలు జరిపి విద్యార్థులు, యువత సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 82 పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకోవడం, నీట్ సహా పలు పరీక్షలు రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర విచారణ జరిపించాలని రామకృష్ణ కోరారు. హుండీ ఆదాయం, విరాళాలు, విలువైన కానుకల వినియోగంపై పారదర్శకత ఉండాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే విడనాడాలని ఆయన కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, పరిశ్రమలు, ఆర్టిసి తదితర ప్రజా సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లాలో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటన దారుణమని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.








కామెంట్లు (0)