- ఎపిజెఎసి చైర్మన్ విద్యాసాగర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిఆర్సి కమిటీతో నియామకంతో పాటు మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించే ఆనవాయితీ లేదని ఉద్యోగ సంఘాలతో శనివారం జరిగిన చర్చల సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించారని ఎపిజెఎసి చైర్మన్ విద్యాసాగర్ చెప్పారు. ఐఆర్ ప్రకటించాలని జెఎసిగా సిఎంగా కోరగా ఆయన ఈ ప్రస్తావన చేశారని చెప్పారు. అయిన్నప్పటికీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, తగిన సమయంలో ఐఆర్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని సిఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. విజయవాడలోని ఎపిఎన్జివోహోంలో జెఎసి సెక్రటరీ జనరల్ కెఎస్ఎస్ ప్రసాద్తో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తమ జెఎసి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఫలితంగానే శనివారం ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించారని చెప్పారు. ఈ పరిణామాన్ని జెఎసిగా తాము స్వాగతిస్తునట్లు తెలిపారు. డిమాండ్ల సాధన అనేది నిరంతర ప్రక్రియ అని, ముఖ్యమంత్రి సమావేశంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో హామీలు అమలు కాకపోయినా, డిమాండ్ల పరిష్కారంలో జాప్యం జరిగినా ఉద్యమ కార్యాచరణ చేపట్టడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు.పిఆర్సి కమిటీ నియామకం, రెండు డిఏల విడుదల, సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల మూడో వారంలో జెఎసి రాష్ట్ర సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, జెఎసి నాయకులు డివి రమణ, సి హెచ్ మంజుల,ఎ. సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)