గంటలోనే కనిపెట్టిన రాజోలు పోలీసులు
ప్రజాశక్తి - రాజోలు: రాజోలులో ఇళ్ల నుండి వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను కేవలం గంట వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించిన రాజోలు పోలీసులు.. ఘటన వివరాల్లోకి వెళ్తే.. రాజోలు గ్రామంలోని నున్నవారి బాడవ, అడవివారిపాలెం ప్రాంతాలకు చెందిన 14, 15, 16 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు మైనర్ బాలికలు స్నేహితులు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన వారు శుక్రవారం సాయంత్రం ఇళ్ల నుండి వెళ్లిపోయారు. రాత్రి 7 గంటలైనా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజోలు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రాజోలు ఎస్ఐ పి. మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసు బృందం అప్రమత్తమైంది. సీసీటీవీ ఫుటేజీలను నిమిషాల వ్యవధిలో పరిశీలించి, బాలికల కదలికలను గుర్తించారు. ఆ తర్వాత స్థానికుల సహకారంతో ప్రత్యేక గాలింపు చేపట్టి, గంట తిరగకముందే ముగ్గురు బాలికలను సమీప ప్రాంతంలోనే సురక్షితంగా కనిపెట్టారు. అనంతరం బాలికలకు తగిన కౌన్సెలింగ్ నిర్వహించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీ అభినందనలు : ఈ ఘటనలో అద్భుతంగా స్పందించిన రాజోలు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. "ఫిర్యాదు అందితే చాలు.. క్షణాల్లో స్పందన, గంటలో ఫలితం" అనేలా రాజోలు పోలీసులు పనిచేసిన తీరుపై స్థానికుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎంత అప్రమత్తంగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.









కామెంట్లు (0)