- ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు.. అక్రమ అరెస్టులు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ : బోర్డు చేసిన తీర్మానం ప్రకారం తమకు శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని, స్విమ్స్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని, కోర్టు ఉత్తర్వులు ప్రకారం సొసైటీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ టిటిడి పాలక మండలికి సామూహిక వినతిపత్రం ఇచ్చేందుకు కాంట్రాక్ట్ కార్మికులు ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి నగరంలోని కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు కార్మికులు చేపట్టిన ఈ ప్రదర్శనను దివ్యరామం పార్క్ వద్ద భారీఎత్తున పోలీసులు అడ్డుకుని వారిని బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లో పడేశారు. మహిళలను సైతం రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అదుపులో తీసుకున్నవారిని అలిపిరి పోలిస్టేషన్కు తరలించారు. అక్రమ కేసులు బనాయించారు. ఈ చర్యను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. మే 6న బోర్డు చేసిన తీర్మాన ప్రకారం నేడు జరుగుతున్న టిటిడి పాలకమండలి సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ శ్రీవారి దర్శన సౌకర్యం, లడ్డు కార్డు, ఐడీ కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలని కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ జయచంద్ర, టి సుబ్రమణ్యం, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు డి పార్థసారధి రెడ్డి, పి బుజ్జి, స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కె వేణుగోపాల్, కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ సిద్ధు, వి ప్రభాకర్, సూపర్వైజర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్ రఘు, స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు.







కామెంట్లు (0)