నేతల అరెస్టుకు పోలీసుల యత్నంతో ఉద్రిక్తత
ఆర్డిఒ హామీతో రిలే నిరాహార దీక్షలు తాత్కాలిక విరమణ
ప్రజాశక్తి - మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లోని నిర్వాసిత యువత తాము చేపట్టిన ఆందోళనను ఉధృతం చేశారు. అందులో భాగంగా రాస్తారోకోకు దిగారు. పోలీసులు అరెస్టులకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువతీయువకులతో పాటు ప్యాకేజీ జాబితాలో మిస్సయిన వారికి న్యాయం చేయాలని కోరుతూ నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. మార్కాపురం ఆర్డిఒ కార్యాలయం ఎదుట శుక్రవారం కొనసాగిన రిలే నిరాహార దీక్షను ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య ప్రారంభించారు. రిలే దీక్షల అనంతరం ప్రదర్శనగా పట్టణంలోని కోర్టు సెంటర్కు చేరుకుని, మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. దీంతో, ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఆందోళన విరమించాలని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు కృష్ణయ్య, నిర్వాసిత పోరాట సంఘం కో కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డికెఎం రఫీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ సైదా తదితరులను అరెస్టు చేసేందుకు యత్నించగా నిర్వాసిత యువత అడ్డుకున్నారు. అనంతరం యువకులు, నాయకులు ఆర్డిఒ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్వాసితుల సమస్యలన్నీ ప్రభుత్వానికి వివరిస్తానని ఆర్డిఒ ఎం.వెంకట శివరామిరెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.








కామెంట్లు (0)