రేపు సిఎం చేతుల మీదుగా విడుదల
గంటవానిపల్లె వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే వెలిగొండ టన్నెల్లోకి ఆదివారం నీరు విడుదల చేయనున్నారు. సోమవారం నాడు ఈ ప్రాజెక్టును సిఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే టన్నెల్లోకి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నీరు బయటకు రావడానికి కనీసం 24 గంటలు పడుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే కొల్లంవాగు ఇన్టేక్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నీరు టన్నెల్ ద్వారా బయటకొచ్చి ఫీడర్ కెనాల్ ద్వారా గంటవానిపల్లె చెరువు వద్ద ఏర్పాటు చేసిన రెగ్యులేటర్ దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ నుండి మార్కాపురం సమీపంలోని నల్లమలసాగర్కు చేరుకుంటుంది. సోమవారం నాడు రెగ్యులేటర్ వద్ద నీటిని సిఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తదితరులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారికంగా ఈ నెల 31నే నీటిని విడుదల చేస్తామని చెప్పినా ఒకరోజు ముందుగానే టన్నెల్ ద్వారా నీరు బయటకు రానుంది. ప్రస్తుతం ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమలసాగర్కు పంపించి అక్కడ నిల్వ చేయనున్నారు. రోజుకు 11,500 క్యూసెక్కుల నీరు ప్రవాహం చేయనుంది. సుమారు పది నుండి పదిహేను రోజులు నీటిని పంపించడం ద్వారా కనీసం 10 టిఎంసిలు నిల్వ చేయాలని నిర్ణయించారు. అయితే నల్లమలసాగర్ నుండి తీగలేరు, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కాలువల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. వీటికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పనులు ఇంకా పూర్తి చేయకపోవడం ఈ ఏడాదికి నీటిని నిల్వ చేస్తామని మాత్రమే అధికారులు చెబుతున్నారు. నల్లమలసాగర్ నుండి నీటిని పంపింగ్ చేసేందుకు వీలుగా ఇప్పటి వరకూ కెనాల్ పనులు పూర్తి చేయలేదు. ఫీడర్ కెనాల్ పూర్తయిన నేపథ్యంలో అడపా దడపా చిన్నచిన్న వర్షాలొచ్చినా, శ్రీశైలంలోకి వరదనీరు చేరినా, నీటిని పంపింగ్ చేసుకునేందుకు వీలవుతుందని అధికారులు వెల్లడించారు.







కామెంట్లు (0)