- ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : హెరిటేజ్ కొరకు విజయ సహకార డైరీని బలిచేస్తున్నారని ఎన్నికైన కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో అధికార పార్టీ రాజకీయ జ్యోక్యం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ప్రకటన విడుదల చేశారు. 1960 లో ప్రారంభమై ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి అయి రైతుల ఆస్తిగా ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డెయిరీన హెరిటేజ్ కోసం బలిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్పష్టం అవుతోందని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు, ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపి ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన మిల్క్ యూనియన్ డైరెక్టర్లను, చైర్మన్ ను అడ్డగోలుగా దించి తమ తొత్తులతో నింపే ప్రయత్నం హెరిటేజ్ ప్రయోజనాల కొరకే అన్నది వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్ కొరకు రైతుల సహకార పాల డైరీని బలితీసుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని వారు డిమాండు చేశారు.








కామెంట్లు (0)