- ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15 నుండి వర్కుటూ రూల్ అమలు చేయనున్నామని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఉద్యమ కార్యాచరణ నోటీసులను అందజేశామని ఆయన తెలిపారు. అలాగే ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ ఒకటోతేదీ నుంచి ఉద్యమ ఉద్యోగులంతా తమ తమ సెల్ఫోన్ వాట్సాప్ డిపిగా సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి అనే నినాదాన్ని పెట్టుకుంటారని తెలిపారు. అదేవిధంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. 3వ తేదీ మరియు 5వ తేదీలలో అన్ని కలెక్టరేట్లు/ఆర్డివో కార్యాలయాల దగ్గర భోజన విరామం సమయంలో నిరసనలు తెలపనున్నట్లు వివరించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ప్రకటించిన కార్యాచరణ ప్రకారం తదుపరి దశల్లో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేపడతామని ఆయన తెలిపారు.







కామెంట్లు (0)