- విచారణకు ఇద్దరు అధికారులతో కమిటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని పనుల్లో కార్మికుడి మృతిపై ప్రపంచబ్యాంకు బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది పనుల్లో కార్మికుల రక్షణ కోసం ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. ఇటీవల అమరావతి పనుల పరిశీలనకు వచ్చిన ప్రపంచబ్యాంకు బృందం ముందుగా దొండపాడులోని ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. అక్కడ లేఅవుట్ పనుల్లో మట్టి పెళ్లలు విరిగిపడి యువ కార్మికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచబ్యాంకు ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ నివేదిక పంపించింది. నెలవారీ పరిశీలనకు వచ్చిన బృందం దొండపాడు సమీపంలోని కార్మికలు మృతిచెందిన లేఅవుట్ను అక్కడి పరిసరాలను క్ష్రేత్రస్థాయిలో పరిశీలివంచింది. ఘటనకు కారణాలను అడిగి తెలుసుకుంది. దీనిపై అధికారులు ఇచ్చిన విరవణకు సంతృప్తి చెందకపోవడంతోపాటు సమీక్ష సమయంలో కార్మికుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పేర్కొంది. ఇప్పటి వరకూ సమర్పించిన నివేదికల ప్రకారం చూస్తే కార్మికుడి మరణం జరగకూడదని, అలా ఎందుకు జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో కార్మికుల రక్షణకు నిధుల విడుదలకు సంబంధం ఉండటంతో వెంటనే కారణాలను అన్వేషించే పనిలో పడింది. ప్రపంచబ్యాంకు నుండి తీసుకున్న అప్పునకు సంబంధించి విధించిన షరతుల్లో భాగంగా ఒప్పందం చేసుకున్న డిస్బర్స్మెంట్ లింక్డ్ ఇండికేషన్(డిఎల్ఐ)లో ఈ అంశం కూడా ఉండటంతో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. దీంతో మొత్తం విచారణ కోసం ఎడిసిఎల్ చీఫ్ ఇంజనీరుతోపాటు మరొక అధికారినతో కలిపి ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అసలు మరణం ఎందుకు జరిగింది ? లోపం ఏమిటి ? పనిలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ? ప్రమాదం జరిగిన తరువాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలను కమిటీ విచారించి నివేదిక ఇవ్వనుంది.







కామెంట్లు (0)