- మంత్రి సవిత
మంగళగిరి: వైసిపి అధినేత వైఎస్ జగన్ అధికారం కోసం సొంత పార్టీ కార్యకర్తలను సైతం పావులుగా ఉపయోగించుకుంటున్నారని బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. వైసిపి ఒక రాజకీయ పార్టీ కాదని, నేరగాళ్ల ముఠాగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఆ పార్టీని ప్రజలు శాశ్వతంగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోందన్నారు. బిసిలు, బడుగు, బలహీన వర్గాలను టిడిపి ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిందని, పారదర్శకంగా నిర్వహించిన నియామక ప్రక్రియ ద్వారా వేలాది మంది బిసి, నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని తెలిపారు. అధికారం కోసం జగన్ రాజకీయ యాత్రల పేరుతో సొంత పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వైసిపి అంతర్గత విభేదాల కారణంగా పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తలను ఉపయోగించుకోవడం జగన్కు అలవాటుగా మారిందని విమర్శించారు.








కామెంట్లు (0)