పోలీసులే చంపేశారని కుటుంబ సభ్యుల ఆందోళన
గడ్డి మందు తాగి మృతి చెందాడన్న పోలీసులు
ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన ఏడుకొండలను దొంగతనం కేసులో మనుబోలు ఎస్ఐ హనీఫ్ కొట్టి, హింసించడంతో ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ అతను గడ్డి మందు తాగడం వల్ల మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. మృతుని కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... విద్యుత్ మోటర్ల దొంగతనం విషయంలో ఏడుకొండలుతో పాటు మరో ఇద్దరు యువకులను మనుబోలు పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. స్టేషన్ సమీపంలో మంగళవారం పడి ఉన్న ఏడుకొండలును గూడూరు ఏరియా ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్టేషన్లో కొట్టి చంపేసి పోలీసులే ఆసుపత్రికి తీసుకెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం నాడు వైసిపి నాయకులతో కలిసి ఏడుకొండలు కుటుంసభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏడుకొండలు మృతదేహాన్ని మనుబోలు పోలీస్టేషన్ వద్దకు తరలించి జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లాకప్ డెత్ కాదు : డిఎస్పి
ఏడుకొండలు మృతి లాకప్ డెత్ కాదని నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... దొంగతనం కేసులో ఏడుకొండలును అరెస్టు చేశారని, సొమ్ము రికవరి చేసిన తర్వాత విడుదల చేశామని తెలిపారు. రోడ్డు పక్కన పడి ఉన్న ఏడుకొండలును చూసిన కానిస్టేబుల్ గూడూరు ఆసుపత్రికి తీసుకెళ్లారని అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు.







కామెంట్లు (0)