బీరుట్ : లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులను యుద్ధ నేరాలుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం డిమాండ్ చేసింది. హిజ్బుల్లాపై యుద్ధం పేరుతో లెబనీస్ ప్రజలను తుడిచిపెట్టేందుకు దాడులు చేపడుతోందని మండిపడింది. ఇజ్రాయిల్ లెబనాన్పై మే 2 నుండి దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ భారీ వైమానిక దాడులు, భూతల దాడులతో చేపట్టిందని, ఈ దాడుల్లో 250మందికి పైగా చిన్నారులు సహా మొత్తం 4,300మంది మరణించారని లెబనాన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 6 నుండి 13 మధ్య పౌరుల నివాసాలపై జరిగిన మూడు దాడులను ఆమ్నెస్టీ వివరిస్తూ.. ఈదాడుల్లో 24మంది పౌరులు మరణించగా, వారిలో 12మంది చిన్నారులు ఉన్నారని పేర్కొంది. కుటుంబాలను తుడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ దాడులు చేపడుతోందని, వాటిని యుద్ధ నేరాలుగా పరిగణించాలని ఆమ్నెస్టీ సూచించింది. తాము ఇజ్రాయిల్ అధికారులను సంప్రదించగా, కొన్ని దాడులు హిజ్బుల్లా సైనిక లక్ష్యాలపై జరిగాయని, మరికొన్ని పరిశీలనకు పంపినట్లు వారు వెల్లడించారని తెలిపింది. కార్యాచరణ సమయంలో పౌరులకు జరిగే హానిని తగ్గించడానికి తాము కట్టుబడి ఉన్నామనిఅధికారులు తెలియజేసినట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. తదుపరి విచారణ జరిపినప్పటికీ, నిర్దిష్ట లక్ష్యాలు సహా ఇజ్రాయెల్ సైన్యం ఆ మూడు దాడులకు సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అందించలేదని ఆమ్నెస్టీ తెలిపింది. దాడుల నుండి ప్రాణాలతో బయటపడినవారు, బంధువులు, పారామెడిక్లు, దాడి జరిగిన ప్రదేశాలను సందర్శించిన పాత్రికేయులు, స్థానిక అధికారులు సహా 15 మందితో జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా ఈనివేదికను రూపొందించినట్లు పేర్కొంది.
లెబనాన్పై ఇజ్రాయిల్ ‘యుద్ధ నేరాల’పై విచారణ చేపట్టాలి : ఆమ్నెస్టీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 10, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)