బరువు తగ్గిన వాంగ్ చుక్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పరీక్ష పత్రం లీక్, సిబిఎస్ఇ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిర్వహిస్తున్న నిరసన జోరు వర్షంలోనూ కొనసాగింది. జంతర్ మంతర్ వద్ద జూన్ 20న ప్రారంభమైన సిజెపి ఆందోళన బుదవారం నాటికి 19 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే వాంగ్చుక్తో పాటు విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 11 రోజులు పూర్తి చేసుకుంది. వందలాది మంది విద్యార్థులు, యువత జోరువర్షంలో కూడా తమ ఆందోళనను కొనసాగించారు. మరోవైపు సాయంత్రం వర్షం తగ్గిన తరువాత ఆందోళన వేదిక వద్ద షాహిద్-ఎ-ఆజం భగత్ సింగ్ స్కిట్ను యువత ప్రదర్శించారు. వాంగ్చుక్ నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుండి ఏడు కేజీలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు 59.40 కిలోలుగా ఉంది. సుదీర్ఘ దీక్ష తరువాత కూడా వాంగ్చుక్ మానసికంగా చురుకుగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కూర్చున్నప్పుడు అతని రక్తపోటు 103/68గా, పడుకున్నప్పుడు 111/73గా నమోదైంది. ఆయన నాడి నిమిషానికి 74 సార్లు, రక్తంలో గ్లూకోజ్ 75, ఆక్సిజన్ సంతృప్తత 98 శాతంగా నమోదు అయింది. ఆయన బరువు నిరంతరం తగ్గడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలను పెంచినప్పటికీ, ఆయన శరీరంలో నీటి శాతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.







కామెంట్లు (0)