ఉద్యోగిపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరంలో మాదిరిగానే ఉత్తరాఖండ్లోని బదరీనాధ్ అలయంలో కూడా విరాళాల వివాదం ఊపందుకుంటోంది. విరాళాల దొంగతనం జరిగిందని వచ్చిన ఆరోపణలపై బదరీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి) మొదటగా స్పందించిన తీరు పట్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసంతృప్తిగా వున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో స్వతంత్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయిలో ముగ్గురితో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15రోజుల్లోగా ఈ కమిటీ సమగ్రంగా ఒక నివేదికను అందచేయాల్సి వుంది.
బికెటిసి ఉద్యోగి ఒకరు ఆలయంలో విరాళాల దుర్వినియోగం చేస్తున్నారని, ఈ అవకతవకల గురించి ఆలయ చైర్మన్ హేమంత్ ద్వివేదికి తెలియచేశామని భైరవ సేనా సంఘటన్ సభ్యుడు సందీప్ ఖత్రి కొద్ది రోజుల క్రితం చెప్పారు.
ఉత్తరాఖండ్ పర్యాటక కార్యదర్శి ధీరజ్ సింగ్ గార్బియల్ విలేకర్లతో మాట్లాడుతూ, బికెటిసి ఇచ్చిన వివరణలో అనేక అంశాలు స్పష్టం కాలేదని చెప్పారు. అందువల్లే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు.
ఈ కమిటీ 40రోజుల సిసిటివి ఫుటేజీని సమీక్షించాల్సి వుంది. సిబ్బంది వ్యవహార శైలి, ప్రవర్తన మెరుగుపరుచుకోవడానికి, పారదర్శకతను పెంచుకోవడానికి సిఫార్సులను కూడా చేయాల్సి వుంటుంది.
బికెటిసి విడిగా నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆ కమిటీ ప్రాధమిక సాక్ష్యాధారాలను కనుగొంది. సస్పెండ్ చేసిన బికెటిసి ఉద్యోగి, అలాగే బికెటిసి చైర్మన్కు ప్రైవేటు కార్యదర్శిగా వున్న ప్రమోద్ నౌతియాల్ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది.







కామెంట్లు (0)