- బిజెపి పాలిత బీహార్లో వీడియో హల్చల్
- విద్యార్థుల జీవితాలతో చెలగాటం : తల్లిదండ్రుల ఆగ్రహం
పాట్నా : బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణ తీరు ప్రహసనంగా మారింది. వివిధ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన వార్తలు వస్తున్న తరుణంలోనే... బీహార్లోని బక్సర్ జిల్లాలో పరీక్షా పత్రాల కట్టలు నీటిపై తేలుతున్న వీడియో తాజాగా వైరల్ అయింది. నీరు నిలిచిన ప్రదేశంలో పరీక్షా పత్రాల కట్టలు ఉండటం, వాటిని అక్కడి నుంచి తొలగించడానికి ప్రజలు ప్రయత్నించడం ఆ వీడియోలో కనిపించింది. బక్సర్లో 9, 10 , 12వ తరగతుల ప్రశ్నాపత్రాలు నీటిలో తేలుతున్నాయనే క్యాప్షన్తో పలు సోషల్ మీడియా పోస్ట్లు కనిపించాయి. వీడియోలో కనిపించినవి పాఠశాలలకు పంపిణీ చేస్తున్న ప్రశ్నాపత్రాలు , సమాధాన పత్రాల కట్టలేనని జిల్లా విద్యాశాఖ అంగీకరించింది. పరీక్షా సామగ్రి పూర్తిగా సురక్షితంగా ఉందనీ, పరీక్షలు షెడ్యూల్ ప్రకారం సజావుగా జరిగాయని చెప్తోంది. జులై 2026 త్రైమాసిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు జూన్ 27 నాటికే జిల్లాకు చేరుకున్నాయని వివరించింది. పంపిణీ సమయంలో అకస్మాత్తుగా వర్షం కురిసినప్పటికీ.. ప్రశ్నాపత్రాల ప్యాకెట్లను సురక్షితంగా రవాణా చేశామని అధికారులు స్పష్టం చేశారు.








కామెంట్లు (0)