- కేంద్ర ప్రభుత్వ తీరుపై ఐఐటీలు, ఐఐఎం, ఐఎన్ఐ విద్యా సంస్థల ఆక్షేపణ
- విబిఎస్ఎ నుంచి మినహాయించాలని డిమాండ్
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యావ్యవస్థను తన గుప్పిట్లో బంధీ చేసుకొనే వినాశకర చర్యలు చేపడుతున్న బిజెపి ప్రభుత్వ తీరుపై ఇప్పుడు దేశంలోనే అగ్రగణ్య విద్యాసంస్థలైన ఐఐటిలు, ఐఐఎంలు సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు (ఐఎన్ఐ)లు అసంతప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముందుకు తీసుకొచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు (విబిఎస్ఎ) - 2025ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు పరిధి నుంచి తమను మినహాయించాలని, స్వతంత్రంగా ఎదగనివ్వాలని స్పష్టం చేశాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా ఈ సంస్థలన్నీ తమ వ్యవస్థాగత స్వయంప్రతిపత్తిని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. బిల్లులోని వైరుధ్యాలను ఎత్తి చూపుతున్నాయి. కేంద్రీకరణకు సంబంధించిన నిబంధనలు వంటి అంశాలను విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం బిజెపి ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఈ బిల్లును సమీక్షిస్తోంది. జెపిసికి అందిన సమాచారాన్ని బట్టి ఎన్డిఎ పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, మధ్యప్రదేశ్ కూడా ఈ బిల్లులోని అనేక నిబంధనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొత్త నియంత్రణా వ్యవస్థ పరిధి నుండి తమ సంస్థలకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని బిల్లులో స్పష్టంగా చేర్చాలని ఐఐటిలు, ఐఐఎంలు, ఐఐఐటి, ఐఐఎస్ఇఆర్లు కోరుతున్నాయి. కాగా ఆన్లైన్ కార్యక్రమాలకు రెగ్యులేటరీ ఆమోదాలకు సంబంధించిన కొన్ని నిబంధనలు, కొత్త కాలేజీల ప్రారంభం, పెనాల్టీ నిబంధనల వర్తింపు వంటి అంశాల నుండి ఐఐటిలను మినహాయించాలని ఐఐటి మద్రాసు కోరుతోంది. పరిశోధన, సిలబస్, విద్యా కార్యకలాపాలకు సంబంధించి తమకు పూర్తిగా వ్యవస్థాగతమైన స్వయంప్రతిపత్తి వుండేలా చూడాల్సిన అవసరం వుందని ఐఐటిలు, ఐఐఎంలు, ఐఐఎస్ఇఆర్లు పేర్కొంటున్నాయి. బిల్లు పరిధి నుండి చట్టం, ఔషధ రంగాలను మినహాయించడంలో తార్కికతను ఐఐటి బాంబే ప్రశ్నించింది.








కామెంట్లు (0)