టెల్అవీవ్ : ఇటు ఇజ్రాయిల్ దుశ్చర్యలు ఆగడం లేదు. గాజాను టార్గెట్గా చేసుకుంటూ దాడులు కొనసాగిస్తోంది. కాల్పలు విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. తాజాగా గాజా మధ్య ప్రాంతంలోని నుసైరాత్ శరణార్థుల శిబిరం పశ్చిమ భాగంలో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దౌత్య చర్చలతోనే పరిష్కారం
- సౌదీ, పాక్ మంత్రుల ఫోన్ సంభాషణ
రియాద్, ఇస్లామాబాద్ : సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, దౌత్యపరమైన పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. సౌదీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను శాంతియుత మార్గంలో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు చర్చించారు. అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రమవకుండా ఉండాలంటే మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలని వారు అభిప్రాయపడ్డారు. ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష, పరోక్ష చర్చలు కొనసాగేందుకు అనుకూల వాతావరణం కల్పించడం అత్యంత ముఖ్యమనీ, దౌత్య చర్చల ద్వారానే సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని ఇద్దరు నాయకులు తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడాలంటే ఉద్రిక్తతలను తగ్గించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు స్పష్టం చేశారు.








కామెంట్లు (0)