ఎన్ని ఎఐలు వచ్చినా..రైతన్న లేకపోతే కడుపు నిండదు
రిటైర్డ్ లోకాయుక్త *జస్టిస్ సంతోష్ హెగ్డే
బెంగళూరు : కృత్రిమ మేధ (ఎఐ) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన సదుపాయాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా..ఆరుగాలం కష్టించే అన్నదాతలు లేకపోతే కడుపు నిండదని రిటైర్డ్ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే హెచ్చరించారు. బెంగళూరు దక్షిణ జిల్లాలో ప్రతిపాదిత బిడది టౌన్షిప్నకు రైతులను భూములను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటోంది. దీనికి వ్యతిరేకంగా అన్నదాతలు కొంతకాలంగా పోరాడుతున్నారు. భైరమంగళ గ్రామంలో అన్నదాతల పోరాట శిబిరాన్ని గురువారం నాడు జస్టిస్ సంతోష్ హెగ్డే సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిడది టౌన్షిప్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించవద్దని, అభివృద్ధి పేరుతో రైతు హక్కులను ఉల్లంఘించరాదని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శిబిరం నుంచే ఆయన ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఇంటి నుంచి బయటకు రావద్దని వైద్యులు సూచించారని, అయినప్పటికీ రైతులు రోడ్డుపై నిరసన తెలపడం చూసి వచ్చానని అన్నారు. వ్యవసాయం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఎన్ని ఏఐలు వచ్చినా వ్యవసాయం చేయకపోతే కడుపు నిండదన్నారు. తాను రైతులతో కలిసి ఈ పోరాటంలో పాల్గొంటానన్నారు. మరోవైపు బిడది టౌన్షిప్ ను వ్యతిరేకిస్తూ బైరమంగళ గ్రామంలో రైతులు చేస్తున్న పోరాటం రోజురోజుకు తీవ్రతరంగా మారుతోంది. గురువారం నాడు ఇక్కడి రైతులు బిడది టౌన్ షిప్ను వ్యతిరేకిస్తూ ‘రక్త ఉద్యమం’ ప్రారంభించారు. రక్తం అయినా ఇస్తాము కానీ..మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ నినదించారు. టౌన్షిప్ మ్యాపుపై రక్తపు బొట్టు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే టౌన్షిప్ ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)