- కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. నిర్భయ తరహా ఘటనను తలపించేలా కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన రాణిబాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి ఆమె పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికెళ్తోంది. ఆ సమయంలో ఆమె సరస్వతీ విహార్లోని బి-బ్లాక్ బస్టాండ్ వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు ఒక ప్రైవేట్ బస్సు వచ్చి ఆగింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లారు. కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని, రాత్రంతా తనను దారుణంగా హింసించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మహిళ వాంగ్మూలం ఆధారంగా, రాణిబాగ్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సెక్షన్లు 64(1) (అత్యాచారం), 70(1) (సామూహిక అత్యాచారం), 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఔటర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ‘సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు పారిపోవడానికి ఎటువంటి అవకాశం లేదు. బాధితురాలికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాం. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని అన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ దేశ రాజధానిలో ఇటువంటి ఘటన జరగటం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇది 2012 నిర్భయ సామూహిక అత్యాచారం-హత్య కేసు తరహాలో, ఢిల్లీలోని రాణిబాగ్ ప్రాంతంలో బస్సు 7 కిలోమీటర్లు దూరం కదులుతూనే ఉందని ఆయన సోషల్ మీడియా ఎక్స్లో తెలిపారు.









కామెంట్లు (0)