చెన్నై:
"సంపాదించిన సంపద కాలక్రమేణా కరిగిపోవచ్చు, కానీ మనిషిని చివరివరకు వీడని ఏకైక ఆస్తి విద్య మాత్రమే" అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. మంగళవారం చెన్నైలోని 'డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్' 36వ పట్టభద్రుల సదస్సులో (కాన్వోకేషన్) ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 3,500 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు, 26 మందికి పీహెచ్డీ డాక్టరేట్లు, 17 మందికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కాలేజీ విద్య పూర్తవ్వడం అంటే చదువు ముగిసినట్లు కాదు, నిరంతర అభ్యాసం వుండాలని, అది జీవితాంతం సాగే నిజమైన అభ్యాసానికి ఆరంభం మాత్రమేనని తిరుక్కురళ్లోని సూక్తులను ఉదాహరిస్తూ మంత్రి పేర్కొన్నారు రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ వంటి ప్రపంచ యుద్ధవాతావరణం, ముడిచమురు, ఎరువుల దిగుమతుల కొరత ఉన్నప్పటికీ, దేశం 7.8% ఆర్థిక వృద్ధి రేటుతో సుస్థిరంగా దూసుకుపోతోందని అన్నారు. శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ సాధించిన విజయాల్లో వినయాన్ని ప్రదర్శించినట్లే, పట్టభద్రులు కూడా వినయాన్ని, నమ్రతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ (AI) వంటి నూతన సాంకేతికతలను ఆహ్వానిస్తూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ నాయకులుగా ఎదగాలని కోరారు.
అలాగే, తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు చేసిన త్యాగాలను, శ్రమను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని విద్యార్థులకు ఆమె సూచించారు.







కామెంట్లు (0)