న్యూఢిల్లీ : రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి శుక్రవారం దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాలు నిండాలని కోరుకున్నారు.
మోడి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో రక్షాబంధన్ సందర్భంగా తన సందేశాన్ని పంచుకున్నారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, విజయాన్ని తీసుకురావాలని.. ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసంతో కూడిన బంధం ఎప్పటికీ విడిపోకుండా ఉండాలని ఆకాంక్షించారు.
మహిళల గౌరవం, భద్రతపై రాజ్నాథ్ సందేశం ....
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న విడదీయలేని ప్రేమ, పరస్పర విశ్వాసం, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, విలువలను రక్షాబంధన్ చాటిచెబుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో మహిళల గౌరవం, భద్రత, ఆత్మగౌరవం, సాధికారత విషయంలో సమాజం మరింత అప్రమత్తంగా, సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సింగ్ సూచించారు. మహిళల గౌరవం, భద్రత, సాధికారత పట్ల ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.






కామెంట్లు (0)