హాకీ మాంత్రికుడిగా గుర్తింపు పొందిన ధ్యాన్ చంద్ కు బాల్యంలో కుస్తీ అంటేనే ప్రాణం. హాకీ పట్ల కనీస ఆసక్తి కూడా లేదు. చదువులో పెద్దగా రాణించకపోవడంతో ఆరో తరగతితోనే పాఠశాల విద్యకు స్వస్తి పలికారు. పదహారేళ్ల ప్రాయంలోనే ఒక సాధారణ సిపాయిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాతే ధ్యాన్ చంద్ లోని అసలైన క్రీడాకారుడు మేల్కొన్నాడు. పగటిపూట డ్యూటీ ముగిసిన తర్వాత రాత్రి వేళల్లో గంటల తరబడి సాధన చేసేవారు. చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఆ వెలుతురే... యావత్ క్రీడా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న 'మేజర్ ధ్యాన్ చంద్'! నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని 'జాతీయ క్రీడా దినోత్సవం' జరుపుకుంటున్నాం. ఒకసారి మన క్రీడా వ్యవస్థను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో, ప్రతిభకు కొదవ లేదు. కానీ, నేటి డిజిటల్ యుగంలో మన యువత మైదానాలకు దూరమై, స్మార్ట్ ఫోన్ తెరలకే అతుక్కుపోతోంది. మరోవైపు పాఠశాలల్లో ఆటల పీరియడ్ను కేవలం కాలక్షేపంగా మార్చేసే విద్యావిధానం నడుస్తోంది. ప్రభుత్వాలు పేరుకు 'ఖేలో ఇండియా' అంటున్నా నిధులు, మౌలిక వసతుల లేమి వెంటాడుతూనే వుంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తేనే ఎందరో ధ్యాన్చంద్లు తయారవుతారు.
(నేడు జాతీయ క్రీడా దినోత్సవం)
- దిడ్డి శ్రీకాంత్,
సెల్: 8686865759








కామెంట్లు (0)