• 1106 టిఎంసిలకు 416 టిఎంసిలు నిల్వ
• ఆగస్టులో వర్షాలు పడకపోతే తీవ్ర ఇబ్బందులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వర్షపాతం లోటుతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. అన్ని రిజర్వాయర్లలో కలిపి 1106 టిఎంసిల సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 416.90 టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో ఎక్కువ భాగం తాగునీటి అవసరాలకోసం వినియోగించాల్సిఉంది. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సాగర్లో నీటిని వాడుతున్నారు. అటువైపు గోదావరి ప్రవాహం దాదాపు తగ్గిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీలేరు నీటిని గోదావరికి వదులుతున్నారు. రిజర్వాయర్లలో నీటి కొరతతో సాగు తగ్గిపోవడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా లోటు వచ్చే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఉన్న మేజర్ రిజర్వాయర్లలో 1014.37 టిఎంసిల కెపాసిటీ ఉండగా వాటిల్లో 381.75 టిఎంసిలు ఉంది. మీడియం రిజర్వాయర్లలో 91.98 టిఎంసిలకుగాను 34.44 టిఎంసిలు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 706.38 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి.
ఈ ఏడాది ఎల్నినోతో వర్ర్షాలు పడకపోవడంతోపాటు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరో వారం రోజులు పోతే దాదాపు వర్షాల సీజన్ సగం ముగిసినట్లే! ఆగస్టులోకూడా వర్షాలు పడకపోతే ఈ సీజన్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కృష్ణాడెల్టాకు పట్టిసీమ నీరు వస్తాయని అనుకున్నా అక్కడ కూడా నీటి ప్రవాహం తగ్గింది. సీలేరు నుండి నీటిని తీసుకుంటున్నారు. దీంతో పూర్తిస్థాయిలో పట్టిసీమ పంపింగ్ సాధ్యమవడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్లలో ఉన్న నీరు దాదాపు తాగునీరు, ప్రస్తుతం పంట సాగులో ఉన్న పొలాలకు అందించడానికి మాత్రమే సరిపోతోంది. ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది.
వరివేస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రాజెక్టుల వారీగా శ్రీశైలంలో 41 టిఎంసిలు, నాగార్జునసాగర్లో 137 టిఎంసిలు, పులిచింతలలో 29 టిఎంసిలు, ప్రకాశం బ్యారేజీలో 1.69 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. నదులవారీగా నీటి నిల్వలను పరిశీలిస్తే గోదావరిలో 18 టిఎంసిలు, కృష్ణానదిలో 428 టిఎంసిలు, పెన్నా నది పరిధిలో 113, ఇతర రిజర్వాయర్ల పరిధిలో 35 టిఎంసిలు ఉన్నాయి. 282 టిఎంసిలు, రాయలసీమ పరిధిలో 100 టిఎంసిలు ఉండొచ్చని అంచనా వేశారు. అదే సమయంలో భూగర్భ జల మట్టం జూన్ నుండి జులై నెలమధ్యలోనే తగ్గుదల కనిపించిందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు.






కామెంట్లు (0)