35, 10 శాతాల చొప్పున జనసేన, బిజెపి డిమాండ్
రెండింటికీ కలిపి 15శాతమే అంటున్న టిడిపి
అసంతృప్తితో ప్రభుత్వ కార్యక్రమాలకు పవన్ దూరం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి పార్టీల మధ్య ‘స్థానిక సంస్థల ఎన్నికల’ సీట్ల సర్దుబాటు చిచ్చు ప్రారంభమైనట్లు సమాచారం. జనసేన, బిజెపి ప్రతిపాదించిన సర్దుబాటును టిడిపి తిరస్కరించడంతో మూడు పార్టీల మధ్య స్థానిక సంస్థల సర్దుబాటు అసంతృప్తి నెలకొనట్లుగా తెలిసింది. అసంతృప్తి వల్లే గురువారం రాజధాని అమరావతిలో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరంగా ఉనట్లు అనుకుంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు తమకు కేటాయించాలని జనసేన, 15 శాతం కేటాయించాలని బిజెపి టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మనకు బలంగా ఉన్నారని, జనసేన, బిజెపిలకు 50 శాతం సీట్లు కేటాయిస్తే ద్వితీయ స్థాయి నాయకులతో పాటు కార్యకర్తలు నష్టపోతారని టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెబుతున్నారు. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జనసేన, బిజెపి ప్రతిపాదించిన సీట్ల శాతంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జనసేనకు 10 శాతం, బిజెపికి 5శాతంకు మించి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలతో లోకేష్ అనట్లు తెలిసింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమవల్లే అధికారంలోకి వచ్చామనే భావన కూటమి పార్టీల్లో నెలకొంది. ముఖ్యంగా టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య ఈ భావన ఉంది. అయితే స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటుపై బహిరంగంగా ఏవరూ మాట్లాడొద్దని టిడిపి అధిష్టానం ఆ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో తమకు తక్కువ సీట్లు కేటాయించడంతో నష్టపోయామని మరోపక్క జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ స్థానాల్లో 12 శాతం, లోక్సభ స్థానాల్లో 0.5 శాతం చొప్పున మాత్రమే సీట్లు కేటాయించారని, దీనివల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని జనసేన నేతలు చెబుతున్నారు. 2024లో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీట్ల విషయంలో రాజీ పడ్డమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండదని జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని రోజుల క్రితం బహిరంగంగానే అన్నారు.
చంద్రబాబుతో వేదిక పంచుకోని పవన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఇటీవల వేదిక పంచుకున్న సందర్భాలు లేవని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భుజానికి సర్జరీ చేయించుకున్న తరువాత మూడు మంత్రివర్గ సమావేశాలు జరిగినా పవన్ ఒక్కదానికి కూడా హాజరు కాలేదు. తన శాఖలపై రోజుమార్చి రోజు సమీక్షలు మాత్రం చేస్తూ మంత్రివర్గానికి ఎందుకు రావడం లేదని ప్రశ్న ఇతర మంత్రుల్లో నెలకొంది. గురువారం రాజధాని అమరావతిలో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం కార్యక్రమానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మున్సిపల్ శాఖమంత్రి పి నారాయణ పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయినా పవన్ విశాఖపట్నం వెళ్లారు. మరోపక్క గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. జనసేన నుంచి కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే హాజరయ్యారు. జనసేన అధినేతతో పాటు, జిల్లా ఇన్చార్జి మంత్రి దుర్గేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి కారణం స్థానిక సంస్థల ఎన్నికల సర్దుబాటు అసంతృప్తి అనే కూటమిలో నాయకులు చర్చించుకుంటున్నారు.






కామెంట్లు (0)