తరువాత బాదుడే
విమానాశ్రయంలో పార్కింగ్ ఛార్జీలపై ఆలోచన చేయాలని కోరుతున్న వాహనదారులు
ప్రజాశక్తి - భోగాపురం (విజయనగరం) : విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్ లేన్లో వాహనాలకు కేవలం ఎనిమిది నిమిషాలే ఉచిత సమయం కేటాయించడం విమానాశ్రయానికి వచ్చే క్యాబ్ డ్రైవర్లు, ప్రయాణికుల బంధువులకు భారంగా మారింది. ఆ గడువు దాటితే 8–10 నిమిషాలకు రూ.250, 10–15 నిమిషాలకు రూ.500 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తుండడంతో పికప్ కోసం వచ్చే వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల కోసం అరైవల్ ప్రాంతంలో వేచి ఉండలేక.. బయట రోడ్డుపైనే క్యాబ్లను నిలిపి ఫోన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బోర్డులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎనిమిది నిమిషాల వరకు ఉచితం, 8 నుంచి 10 నిమిషాల మధ్య రూ.250, 10 నుంచి 15 నిమిషాల మధ్య రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 15 నిమిషాలు దాటితే టూవే ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.విమానం దిగిన ప్రయాణికుడి కోసం ఎనిమిది నిమిషాలలోపు వేచి ఉండడం సాధ్యమేనా? అని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లగేజీ తీసుకుని బయటకు వచ్చేందుకు ప్రయాణికులకే కొంత సమయం పడుతుందని, ఒకవేళ వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారు బయటకు రావడానికి_ఇంకాస్త ఎక్కువ సమయమే పడుతుందని వారు చెబుతున్నారు. విమానం ఆలస్యం కావడం, ప్రయాణికులు అరైవల్ ప్రాంతానికి చేరుకోవడంలో జాప్యం జరిగితే డ్రైవర్లపై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల భారం భరించలేక విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో క్యాబ్లు నిలిపివేసి డ్రైవర్లు వేచి చూస్తున్నారు. ప్రయాణికులు విమానం దిగి బయటకు వచ్చాక ఫోన్ చేస్తే తీసుకురావడానికి వెళ్తున్నారు. ప్రయాణికులను పికప్ చేసుకునే క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఎక్కువ ఉచిత సమయం కల్పించాలని, పికప్ ప్రాంతంలో ఛార్జీలను పరిశీలించి తక్కువ ధర_నిర్ణయించాలని వారు కోరుతున్నారు. ప్రయాణికులతో వచ్చే కుటుంబ సభ్యులు, సహాయకులకు కూడా ఇబ్బందులు లేకుండా తగిన వెయిటింగ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జనరల్ పార్కింగ్ ఛార్జీలు ఇలా..
మరోవైపు విమానాశ్రయంలోని జనరల్ పార్కింగ్లోనూ వాహనాలకు వివిధ రకాల ఛార్జీలను నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ బోర్డు ప్రకారం 30 నిమిషాల వరకు ప్రైవేట్ కారుకు రూ.100, కమర్షియల్ కారుకు రూ.200, ద్విచక్ర వాహనానికి రూ.20గా ఛార్జీ వసూలు చేస్తున్నారు. 30 నిమిషాల నుంచి గంటలోపు ప్రైవేట్ కారుకు రూ.150, కమర్షియల్ కారుకు రూ.300, ద్విచక్ర వాహనానికి రూ.30గా నిర్ణయించారు. ఒక గంట నుంచి రెండు గంటల వరకు ప్రైవేట్ కారుకు రూ.200, కమర్షియల్ కారుకు రూ.400, ద్విచక్ర వాహనానికి రూ.50గా ఉంది. రెండు గంటలు దాటిన తర్వాత ప్రతి అదనపు గంటకు ప్రైవేట్ కారుకు రూ.50, కమర్షియల్ కారుకు రూ.100, ద్విచక్ర వాహనానికి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. 24 గంటల వరకు పార్కింగ్ చేసుకుంటే ప్రైవేట్ కారుకు రూ.450, కమర్షియల్ కారుకు రూ.600, ద్విచక్ర వాహనానికి రూ.130గా ఛార్జీలు నిర్ణయించారు. జనరల్ పార్కింగ్ ఛార్జీలు కూడా అధికంగా ఉండడంతో ప్రయాణికులను తీసుకువచ్చే కుటుంబ సభ్యులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ఛార్జీలను పునఃపరిశీలించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.








కామెంట్లు (0)