- ప్రతినెలా వినియోగదారులపై భారం
- భారాలు మోపలేదంటునే వసూలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : తమ ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని ముఖ్యమంత్రి, ఇంధన శాఖమంత్రి పదేపదే చెబుతున్నారు. కానీ చార్జీలు పెంచకుండానే ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ఎఫ్ పిపిసిఎ) ఛార్జీల పేరుతో వినియోగదారులపై ప్రతి నెలా డిస్కంలు భారం మోపుతున్నాయి. మరో వైపు అధికంగా వసూలు చేసిన ఛార్జీలను ట్రూడౌన్ కింద వినియోగదారులకు చెల్లించని పరిస్థితి నెలకొంది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్లో సర్దుబాటు కింద రూ.285.88కోట్లు డిస్కంలు వసూలు చేశాయి. యూనిట్కు 0.4078 పైసలు చొప్పున ఎస్పిడిసిఎల్, ఇపిడిసిఎల్ యూనిట్కు 0.4064 పైసలు, సిపిడిసిఎల్ యూనిట్కు 0.4047ల చొప్పున వసూలు చేశాయి. గతంలో యూనిట్కు 40పైసలకే ఉన్న సీలింగ్ పరిమితిని ఎపి విద్యుత్ నియంత్రణ మండలి రద్దు చేసింది. దీంతో యూనిట్కు ఎంతైనా వసూలు చేసుకునే అవకాశం డిస్కంలకు లభించింది. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన క్లెయిమ్ల పేరుతో రూ.368.98 కోట్ల మేరకు వసూలు చేస్తునట్లు ఏప్రిల్ ఎఫ్పిపిసిఎలో డిస్కంలు చూపాయి. కమిషన్ దీనిని తిరస్కరించింది. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ప్లాంట్కు రూ.366.98 కోట్లు స్థిర చార్జీల కింద చెల్లించాలనే ప్రతిపాదనను కమిషన్ తిరస్కరించింది. ఈ తిరస్కరించిన క్లెయిమ్లను ఏప్రిల్ సర్దుబాటులలో చూపి వసూలు చేసేందుకు పూనుకున్నాయి. అందులో భాగంగానే రూ.85.88కోట్లు వసూలు చేశాయి. ట్రూడౌన్ కింద రూ.80.26 కోట్ల మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉండగా డిస్కంలు వెనక్కి ఇవ్వలేదు.
అనుమతులు మించి విద్యుత్ కొనుగోలు
విద్యుత్ కొనుగోళ్లు విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన అనుమతులు మించి డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. కమిషన్ అనుమతి ఇచ్చిన దాని కంటే రూ.509.93 కోట్ల మేర అదనపు వ్యయం జరిగింది. విద్యుత్ వాస్తవ లభ్యత మూడు డిస్కంలు 8440 మిలియన్ యూనిట్లు(ఎంయు)గా చూపాయి. కమిషన్ అనుమతి ప్రకారం 7279.76 ఎంయులు కొనుగోలు చేయాల్సి ఉండగా 7848.21ఎంయులు కొన్నాయి. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ పీక్ సమయంలో మార్కెట్లో 565.50 ఎంయులను యూనిట్కు రూ.3.89ల చొప్పున కొనుగోలు చేశాయి. అందుబాటులో ఉన్న 166 ఎంయులను యూనిట్కు రూ.6.72ల చొప్పున మార్కెట్లో డిస్కంలు విక్రయించాయి. స్వాపింగ్ పద్ధతిలో 388.32 ఎంయులను పంజాబ్ నుంచి తీసుకున్నాయి. ఏప్రిల్లో విద్యుత్ కొనుగోలుకు కమిషన్ రూ.3938.03 కోట్లకు అనుమతి ఇవ్వగా డిస్కంలు రూ.4536.93 కోట్లు మేర ఖర్చు చేసి అదనంగా రూ.509.93కోట్ల వ్యయం జరిగినట్లు చూపాయి. విద్యుత్ కొనుగోలు ధర కమిషన్ నిర్ణయించిన యూనిట్ సగటు రూ.5.41ల నుంచి రూ.5.78లకు పెరిగింది. మరో పక్క ప్రభుత్వం మాత్రం తాము విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించామని ఊదరగొడుతోంది. ఏప్రిల్లో కమిషన్ ఉత్తర్వుల్లో అనుమతించిన దానికంటే ప్రసార, ఎస్ఎల్డిసి చార్జీలు రూ.11.75 కోట్ల మేరకు తగ్గాయి. ఏప్రిల్లో లోపభూయిష్ట నిబంధనలతో డిస్కంలు అనుమతించదగని క్లెయిమ్లను చూపి అధిక మొత్తాలకు నెలనెలా వసూలు చేసినా కమిషన్ వాటిని వెంటనే సరిదిద్దాలని ఆదేశించడం లేదు. ఆర్ధిక సంవత్సరం ముగిసిన తరువాత డిస్కంలు దాఖలు చేసే సర్దుబాటు క్లెయిమ్లను పరిశీలించి, బహిరంగ విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తుంది. అనుమతించదగని అధిక మొత్తాల క్లెయిములను నెలనెలా చూపుతూ, వినియోగదారుల నుంచి వసూలు చేస్తూ, ఏడాది చివరిలో ట్రూడౌన్ క్లెయిములను చూపి ఘనకార్యం సాధించినట్లు ప్రచారం చేసుకునే విధంగా వీలు కల్పిస్తున్నాయి.







కామెంట్లు (0)